Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha) మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి ఉద్దేశపూర్వకంగా సీటు నిరాకరించడం ద్వారా మోదీ ఆయనను అవమానించారని పేర్కొన్న ఆమె.. మోడీ చర్యను తీవ్రంగా ఖండించారు. “ఇది సాధారణ ప్రోటోకాల్ లోపం కాదు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలు, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన రాజకీయ ప్రవర్తన, అలాగే బీజేపీ రాజకీయ సంస్కృతిలో చోటు చేసుకున్న ఆందోళనకరమైన మార్పునకు ప్రతీక” అని రేఖ ధ్వజమెత్తారు. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్య సంస్థలకు, రాజ్యాంగ విలువలకు, ప్రతిపక్ష గౌరవానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన రేఖ బోయలపల్లి ప్రతిపక్ష నేతపట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించిన దాఖలాలు చరిత్రలో ఎన్నడూ లేవని ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఆనవాయితీ ప్రకారం మోదీ తనకు ముందు వరుసలో సీటు నిరాకరించడంపై రాహుల్ గాంధీ హుందాగా స్పందించారని ఆమె అన్నారు. అది ఆయన సంస్కారం, ఆయనకున్న విలువలు, నాయకత్వానికి నిదర్శనమని డా. రేఖ పేర్కొన్నారు. “హుందాగా వ్యవహరించడం బలహీనత కాదు. సిద్ధాంతాలు, విలువలపై నిర్మితమైన బలమైన నాయకత్వానికి ప్రతిరూపం,” అని ఆమె స్పష్టం చేశారు. దేశానికి అవసరమైనవి విభజన, అవమానం, అహంకార రాజకీయాలు కాదుని.. ఐక్యత, సమన్వయం, గౌరవం, ప్రజాస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా పనిచేసే రాహుల్ గాంధీ నాయకత్వం అని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
Admin
Studio18 News