Studio18 News - TELANGANA / HYDERABAD : గిరిజన హాస్టళ్లలో బియ్యం దుర్వినియోగం జరుగుతూ విద్యార్థుల పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిత్యవసర సరుకులను అమ్ముకుంటూ కొందరు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. నీళ్ల చారు, చాలీచాలని అన్నం ఇస్తూ, ప్రశ్నించిన విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వార్డెన్లను వెంటనే తొలగించాలని పి.వై.ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, రేషన్ సరుకులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్ల మండలంలోని ఎస్టీ బాలబాలికల వసతి గృహాల్లో వార్డెన్ల అక్రమాలు పెరిగిపోయాయని, విద్యార్థులకు ఇవ్వాల్సిన బియ్యం, పప్పులను బయట మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ ఆరోపించారు. సత్యనారాయణపురం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందని, సరుకులను తమ గదులకు తరలించి విద్యార్థులకు అరకొరగా మాత్రమే అందిస్తున్నారని ఆయన విమర్శించారు. కిలో బియ్యాన్ని రూ.30కి విక్రయిస్తున్నారని, సరైన ఆహారం ఇవ్వాలని అడిగితే విద్యార్థులను కొడుతున్నారని ఆరోపించారు. అలాగే మహిళా సిబ్బందితో కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. పాతచర్ల ఎస్టీ గర్ల్స్ హాస్టల్, పీఎంహెచ్ కాలేజీ హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ నాగమణి కూడా సరుకుల అక్రమ విక్రయాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించారు. సరుకులను వాచ్మన్ ఇంట్లో నిల్వ చేసి బయట విక్రయిస్తున్నారని, ఈ విషయాలు బయటకు చెబితే విద్యార్థులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లను వెంటనే తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అనుభవజ్ఞులైన వార్డెన్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ అధికారులు స్పందించి హాస్టళ్లలో మెరుగైన వాతావరణం కల్పించకపోతే విద్యార్థుల పక్షాన దశలవారీ ఆందోళనలు చేపడతామని ముసలి సతీష్ హెచ్చరించారు.
Admin
Studio18 News