Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఖమ్మంలోనే మకాం వేసి బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాటం కొనసాగించారు. సుమారు 15 రోజుల క్రితం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ పోలీసు బలగాల మధ్య ఇళ్లను కూల్చివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే దేవకి వాసుదేవరావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచారు. ఇళ్ల కూల్చివేత తీరును తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్కు బాధితుల పరిస్థితిని వివరించి వారు ఖమ్మం వచ్చే విధంగా తీసుకువచ్చి బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అలాగే అంబేద్కర్ భవనంలో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులకు భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు పలు మార్లు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వం వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ చేసిన నిరంతర పోరాట ఫలితంగానే భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు సాధ్యమయ్యాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమిలో ఆక్రమణకు గురైన 30 ఎకరాల భూమిని కూడా వెలికితీసి ఇందుకు మా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Admin
Studio18 News