Studio18 News - TELANGANA / MANCHERIAL : కన్నెపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని వార్త రాసిన ఎన్కే 24 రిపోర్టర్ చంద్రశేఖర్పై పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఆయనపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే రద్దు చేయాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేసినప్పటికీ వారిపై పెటీ కేసు మాత్రమే పెట్టారని అన్నారు. బాధితునికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరిపై నమోదైన తప్పుడు కేసును రద్దు చేయకపోతే పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు బాధితుడు చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేయకుండా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి కాంట్రాక్ట్ పనిని ఇతరులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, గోవర్ధన్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News