Studio18 News - TELANGANA / KARIMNAGAR : డబ్బులు, బంగారంపై పెంచుకున్న వ్యామోహం ఓ కొడుకును హంతకుడిగా మార్చింది. కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ (52) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె చిన్న కుమారుడు ఈరెల్లి అనిల్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతురాలు గౌరమ్మ తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు మరియు రెండు బంగారు ఉంగరాలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకుంది. మార్చి 3వ తేదీన ఆమె బ్యాంకు నుండి ఆ నగదును, నగలను విత్డ్రా చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయం గమనించిన నిందితుడు అనిల్ కుమార్ ఆ డబ్బును తనకివ్వాలని తల్లిని వేధించాడు. ఆమె నిరాకరించడంతో పథకం ప్రకారం హత్యకు ఒడిగట్టాడు. మార్చి 5వ తేదీ మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అనిల్ కుమార్ తన తల్లిపై దాడి చేశాడు. నిద్రిస్తున్న తల్లి గొంతును కూరగాయలు కోసే కత్తితో బలంగా కోసి ప్రాణాలు తీశాడు. అనంతరం బీరువాలోని నగదు, నగలతో పరారయ్యాడు. గౌరమ్మ పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. విచారణలో అనిల్ కుమార్ చేసిన దారుణం బయటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, అతని సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఒక చిన్న ఆశ కోసం కన్నతల్లిని చంపుకున్న కొడుకు ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Admin
Studio18 News