Studio18 News - TELANGANA / HYDERABAD : గ్రంథాలయాలతోనే జ్ఞాన సముపార్జన సాధ్యమని పేర్కొన్నారు. పాల్వంచలో గ్రంథాలయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: పుస్తక పఠనం ద్వారానే ఉన్నత విజ్ఞానం సిద్ధిస్తుందని, విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను విజ్ఞాన మందిరాలుగా భావించి వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పాల్వంచ శాఖా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ సభ్యత్వ నమోదు మరియు గ్రంథాలయ పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరబాబు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అవసరమైన పుస్తకాలు, వసతులు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులుగా పాల్గొన్న 1వ వార్డు కౌన్సిలర్ సీరం సుగుణ, స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ కరస్పాండెంట్ జి. భాస్కరరావు మాట్లాడుతూ గ్రంథాలయ సేవలను వినియోగించుకున్న వారే ఉన్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీరం సుగుణను, లైబ్రేరియన్ కె. మధుబాబును జిల్లా గ్రంథాలయ చైర్మన్ వీరబాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల అభ్యర్థులు, స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ విద్యార్థులు, డాక్టర్ జ్యోత్స్న మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News