Studio18 News - జాతీయం / : బెంగళూరు: ఒక మహిళ రాత్రి వేళ స్కూటీపై ఒంటరిగా వెళ్తున్నది. మరో స్కూటీపై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటపడ్డారు. పలుమార్లు స్కూటీని క్రాస్ చేయడంతోపాటు కామెంట్లతో ఆమెను వేధించారు. (Men On Scooty Harass Woman Rider) కారులో ఉన్న వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 23న రాత్రి వేళ సిల్క్ బోర్డ్ రూట్లోని రహదారిపై ఒక మహిళ ఒంటరిగా స్కూటీపై వెళ్తున్నది. కాగా, అదే రహదారిపై స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను వెంబడించారు. పలుసార్లు ఆమె స్కూటీని క్రాస్ చేశారు. సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ఆ మహిళ స్కూటీని వెంబడించి వేధించారు. మరోవైపు ఆ వ్యక్తుల స్కూటీ వెనుక కారులో ఉన్న వ్యక్తి డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో దీనిని రికార్డ్ చేశాడు. గమనించిన ఆ వ్యక్తులు తమ స్కూటీపై అక్కడి నుంచి పారిపోయారు. కారులోని వ్యక్తి ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బెంగళూరులో రాత్రి 10 గంటల లోపు మహిళ పట్ల ఇలా జరుగడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ వీడియో క్లిప్ను పోలీసులకు ట్యాగ్ చేశాడు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. స్కూటీ నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించినట్లు తెలిపారు. మహిళా రైడర్ను వేధించిన ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
Admin
Studio18 News