Studio18 News - జాతీయం / : జమ్మూకశ్మీర్లోని పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ గత రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం స్పష్టం చేశారు. యూరి సెక్టార్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, "పాకిస్థాన్ దాడులు చేసింది. కానీ ఎలాంటి దుశ్చర్యలనైనా ఎదుర్కొని, తిప్పికొట్టేందుకు భారత సాయుధ బలగాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి" అని తెలిపారు. జమ్మూకశ్మీర్ యంత్రాంగం ఇక్కడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. సరిహద్దు గ్రామాలలో పర్యటించి, నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించినట్లు సిన్హా వెల్లడించారు. ఈ ఘటనల్లో గాయపడిన వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా ఎక్స్గ్రేషియా అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, ఈ ప్రాంతాల్లో కొత్త బంకర్ల నిర్మాణం ఆవశ్యకత ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో కొత్త బంకర్లను నిర్మిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ హామీ ఇచ్చారు. సరిహద్దు ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, యూరి సెక్టార్లో భద్రతా బలగాలను కలిసిన ఎల్జీ వారితో మాట్లాడుతూ "హౌ ఈజ్ ది జోష్" అని అడిగారు.
Admin
Studio18 News