Studio18 News - జాతీయం / : భారత్, పాకిస్థాన్ల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక భద్రతా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చేలా వారం రోజుల పాటు డ్రోన్లు, బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. ప్రజల భద్రత, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం హర్ష్ సంఘవి ఈ వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. "రాష్ట్రంలో జరిగే ఏ వేడుకల్లోనైనా బాణసంచా, డ్రోన్లపై ఈ నెల 15వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నాం. దయచేసి ఈ మార్గదర్శకాలను పాటించి, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం" అని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఇందులో భాగంగానే గుజరాత్ ప్రభుత్వం తాజా ఆంక్షలను విధించింది.
Admin
Studio18 News