Studio18 News - జాతీయం / : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశాజనకమని, ఇవి దశాబ్దాలుగా భారత్ కష్టపడి సాధించుకున్న దౌత్యపరమైన పురోగతిని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రధానంగా నాలుగు అంశాల్లో భారత్కు నష్టం చేకూర్చేలా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. శశి థరూర్ తన విశ్లేషణలో పేర్కొన్న నాలుగు కీలక నష్టాలు: 1. బాధితుడిని, నేరస్థుడిని ఒకే గాటన కట్టడం: "ట్రంప్ వ్యాఖ్యలు బాధితురాలైన భారత్ను, సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను ఒకే గాటన కడుతున్నాయి. ఇది పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలపై గతంలో అమెరికా తీసుకున్న దృఢమైన వైఖరికి పూర్తి విరుద్ధం" అని థరూర్ పేర్కొన్నారు. ఈ వైఖరి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2. పాకిస్థాన్కు అనవసర ప్రాధాన్యత: "ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్కు ఎలాంటి అర్హత లేని ఒక చర్చా వేదికను, ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. ఉగ్రవాదులు తుపాకీ గురిపెట్టి బెదిరిస్తుంటే, వారి షరతులకు లోబడి భారత్ ఎన్నటికీ చర్చలు జరపదు," అని థరూర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ను చర్చలకు ఆహ్వానిస్తున్నట్లుగా ట్రంప్ మాట్లాడటం భారత్ స్థానాన్ని బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. 3. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం: "అత్యంత ప్రమాదకరమైన అంశం, ఇది కశ్మీర్ వివాదాన్ని 'అంతర్జాతీయం' చేస్తుంది. ఇది ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఎప్పటినుంచో కోరుకుంటున్నది. భారత్ కశ్మీర్ను ఒక వివాదంగా పరిగణించదు, అది పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారం. పాకిస్థాన్తో ఉన్న ద్వైపాక్షిక సమస్యలపై భారత్ ఎన్నడూ ఏ విదేశీ మధ్యవర్తిత్వాన్ని కోరలేదు, కోరే అవకాశం కూడా లేదు," అని కాంగ్రెస్ నేత తెలిపారు. 4. భారత్-పాక్లను మళ్లీ ఒకే గాటన కట్టడం (రీ-హైఫనేషన్): "ఈ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిలో భారత్, పాకిస్థాన్లను మళ్లీ 'ఒకే గాటన కట్టే' (రీ-హైఫనేట్) ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా, ప్రపంచ నాయకులు భారత పర్యటనలను పాకిస్థాన్ పర్యటనలతో కలపకూడదని మనం ప్రోత్సహిస్తూ వస్తున్నాం. 2000 సంవత్సరంలో క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి, ఏ అమెరికా అధ్యక్షుడు అలా చేయలేదు. ట్రంప్ వ్యాఖ్యలు ఈ దౌత్యపరమైన పురోగతికి పెద్ద తిరోగమన చర్య" అని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారత్ ప్రత్యేకతను, ప్రపంచ వేదికపై దాని పెరుగుతున్న ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నమని ఆయన అన్నారు.
Admin
Studio18 News