Studio18 News - జాతీయం / : కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది. ఈ 12 స్థానాల్లో 10చోట్ల జూన్లో లోక్సభకు ఎన్నికవ్వడంతో ఖాళీ అయ్యాయి. మరో రెండింటీలో తెలంగాణ నుంచి ఒకటి (కే కేశవరావు తన పదవికి రాజీనామా చేశారు), ఒడిశా నుంచి మరోకటి ఖాళీ ఉన్నాయి. ఇలా 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక అయ్యారు. వీటిలో అస్సాం నుండి సర్బానంద సోనోవాల్, హర్యానా నుండి దీపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ నుండి కెసి వేణుగోపాల్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్ ఉన్నారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఆగస్టు 21. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే బీహార్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునే వీలు ఉంది.
Admin
Studio18 News