Studio18 News - జాతీయం / : జమ్మూ కశ్మీర్లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ దూసుకెళుతోంది. ఇక్కడ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 52 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 2 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో తమ విజయం ఖాయమని తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని, అయితే ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలన్నారు. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్ను ప్లే చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దని సూచించారు. ఒమర్ అబ్దుల్లా గండేర్బల్, బుడ్గామ్... రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండుచోట్ల కూడా ఆయనే ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ బోణీ కొట్టింది. బండీపురా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి నజీర్ అహ్మద్ 1,132 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ కోసం, తన కోసం పని చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ బీజేపీ ఓటమి కేవలం ఆ పార్టీది మాత్రమే కాదని, నరేంద్రమోదీది కూడా అని అన్నారు.
Admin
Studio18 News