Studio18 News - జాతీయం / : Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. హెవీ వెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు జరగడం, రూపాయి విలువ (Rupee value) పుంజుకోవడం లాంటి అంశాలు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో రోజంతా మార్కెట్లలో జోరు కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 447.55 పాయింట్లు లాభపడి 84,929 వద్ద స్థిరపడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 25,966 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో మొదలైంది. ఒక దశలో 85,067.50 గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 25,993 వరకు వెళ్లింది. సెన్సెక్స్ స్టాక్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ 2 శాతానికిపైగా లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా రాణించాయి. మరోవైపు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు సుమారు 1 శాతం నష్టపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు చెరొక 1.3 శాతం పెరిగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 89.25 వద్ద ముగియడం కూడా మార్కెట్లకు అదనపు బలాన్నిచ్చింది. ఇటీవలి రికవరీని బట్టిచూస్తే వచ్చే వారం ‘శాంటా ర్యాలీ’కి అవకాశం కనిపిస్తోంది.
Admin
Studio18 News