Studio18 News - జాతీయం / : భారత్-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశంలో ఏటీఎంలు మూతపడతాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ వార్తలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సహా దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు తీవ్రంగా ఖండించాయి. తమ ఏటీఎంలతో పాటు అన్ని డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో, సజావుగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశాయి. ఎస్బీఐ తమ అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా, "మా అన్ని ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు మరియు డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ప్రజల వినియోగానికి అందుబాటులో ఉన్నాయని" పేర్కొంది. ధృవీకరించని సమాచారంపై ఆధారపడవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. పీఎన్బీ కూడా తమ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, డిజిటల్ సేవలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఇదే విధమైన హామీ ఇచ్చాయి. మరోవైపు, దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. అనవసరంగా కొనుగోళ్లు చేయవద్దని, ఇంధనం, ఎల్పీజీ అన్ని అవుట్లెట్లలో సులభంగా అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా, దేశంలో ఆహార ధాన్యాలు లేదా ఇతర నిత్యావసర వస్తువుల కొరత లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) భరోసా ఇచ్చింది. అన్ని వస్తువులు మార్కెట్లలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం వద్ద కూడా తగినన్ని నిల్వలు ఉన్నాయని పేర్కొంది. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, వ్యాపారులు దేశ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూస్తారని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థల సైబర్ భద్రత సన్నద్ధతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలపైనే ఆధారపడాలని అధికారులు సూచిస్తున్నారు.
Admin
Studio18 News