Studio18 News - జాతీయం / : Srilanka PM Harini amarasuriya : శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల త్రిముఖ పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే విజయం సాధించాడు. రాజపక్స కుటుంబం అవినీతి పాలనకు విసిపోయిన ప్రజలు దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటిరోజే శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈమేరకు ఆమె మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిరియావో బండారు నాయకే తరువాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్ పీపీ) కి చెందిన 54ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. ఆమెతోపాటు మరో ఇద్దరు నేతలను క్యాబినెట్ మంత్రులుగా నియమించారు. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా హరిణి గుర్తింపు పొందారు. శ్రీలంక నూతన ప్రధాన మంత్రి హరిణి అమరసూర్య కు భారతదేశంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె 1991 నుంచి 1994 వరకు ఢిల్లీ యూనివర్శిటీలో సోషియాలజీలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారని వార్తా సంస్థ పీటీఏ నివేదించింది. 1990ల ప్రారంభంలో ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని హిందూ కళాశాలలో ఆమె చదువుకున్నారు. హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కళాశాల పూర్వ విద్యార్థి శ్రీలంక ప్రధాని కావటం పట్ల గర్వకారణంగా ఉందని అన్నారు. హరిణి 1991 నుంచి 1994 వరకు సోషియాలజీ విద్యార్థిని. ఆమె సాధించిన విజయాల పట్ల మాకు చాలా గర్వంగా ఉందని అన్నారు. అమరసూర్య.. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుండి సోషల్ ఆంత్రోపాలజీలో డాక్టరేట్ పట్టా కూడా పొందారు. ఆమె అప్లైడ్ ఆంత్రోపాలజీ & డెవలప్మెంట్ స్టడీస్లో మాస్టర్స్ కూడా చేసింది.
Admin
Studio18 News