Studio18 News - జాతీయం / : ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ, భారత్పై నిత్యం విషం చిమ్ముతున్న పాకిస్థాన్ వైఖరిని భారత అఖిలపక్ష బృందం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందం లండన్లో పర్యటించింది. ఈ బృందంలో సభ్యురాలైన శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న భారత్ జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తుంటే, పొరుగునే ఉన్న పాకిస్థాన్ మాత్రం టీ-20 (టాప్-20) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడులకు సూత్రధారి అయిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చిందని ప్రియాంక చతుర్వేది గుర్తుచేశారు. లాడెన్కు పాకిస్థాన్ ఎలా ఆశ్రయం కల్పించింది, ఉగ్రవాదులకు నిధులు ఎలా సమకూర్చింది, వారికి శిక్షణ ఎలా ఇచ్చింది, ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా ప్రోత్సహించింది అనే విషయాలపై ఒక డాక్యుమెంటరీ కూడా ఉందని, దాన్ని అందరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోందని ప్రియాంక అన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు మాత్రమే స్థానం ఉందని, విద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా అక్కడివారికి వివరించారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టి పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికీ, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే భారత ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపి, పాకిస్థాన్ చర్యలను వారి ముందు ఉంచుతోంది.
Admin
Studio18 News