Studio18 News - జాతీయం / : సింధు నదీ జలాల ఒప్పందం అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో తమ సంస్థ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వివాదంలో ప్రపంచ బ్యాంక్ పాత్ర కేవలం ఒక సహాయకుడిగా మాత్రమే పరిమితమై ఉంటుందని స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో అజయ్ బంగా భారత పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసి, రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా, సిక్కు అమెరికన్గా బంగా చరిత్ర సృష్టించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గామ్ దాడి అనంతరం, సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అజయ్ బంగా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
Admin
Studio18 News