Studio18 News - జాతీయం / : మహా కుంభమేళా భారత సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలను ప్రతిబింబించిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే, కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందినవారికి ప్రధాని మోదీ నివాళులర్పించలేదని ఆయన విమర్శించారు. కుంభమేళాకు వెళ్లిన యువత దేశ ప్రధానమంత్రి నోట మరో మాట కూడా వినాలని భావించారని, వారికి ఉద్యోగాలు కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు. విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. సభలో ప్రధానమంత్రి లేదా మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు మాట్లాడేందుకు అనుమతి ఉండదని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పామని అన్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి నిబంధనలు అర్థం కాలేదని ఆయన విమర్శించారు.
Admin
Studio18 News