Studio18 News - జాతీయం / : జోధ్పుర్ జిల్లా బోరనాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై, అతనికి మద్దతుగా నిలిచిన వ్యక్తులపైనా కేసు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది. బోరనాడ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధినిని ఇంగ్లిష్ బోధిస్తున్న దల్పత్ గార్గ్ అనే ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేశాడు. తనకు జాతకం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్నారని, పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు. దీనిపై తన కుమార్తెను సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తండ్రి జనవరి 11న ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా, సంబంధిత సీసీ టీవీ పుటేజీతో పాటు నివేదికను ఉన్నతాధికారులకు పంపగా సదరు ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేస్తున్న వారిపైనా అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకసారి తమను లూని పంచాయతీ సితి చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసుకు తీసుకువెళ్లి అక్కడ అందరూ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని, ఒక వేళ అలా చేయకపోతే, తన కుమార్తెకు టీసీ ఇవ్వబోమని, ఎక్కడా అడ్మిషన్ దొరకదంటూ కూడా బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాలిక తండ్రి పేర్కొన్నాడు. దీంతో బాలికను వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బుధవారం మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసిన అందరిపైనా కూడా కేసులు నమోదు చేశారు.
Admin
Studio18 News