Studio18 News - జాతీయం / : జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్థులు తీవ్రంగా నష్టపోయారు. పూంచ్, రాజౌరీ, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్లో ఒక ఆలయం, గురుద్వారా, మసీదు కూడా ఈ కాల్పుల వల్ల దెబ్బతిన్నాయని వీడియోల్లోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత సైన్యం పేర్కొంది. గురువారం రాత్రి పాక్ బలగాలు డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పశ్చిమ సరిహద్దు వెంబడి అనేక దాడులకు ప్రయత్నించాయని, వీటిని భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆర్మీ తెలిపింది. బారాముల్లా జిల్లా లగామా గ్రామానికి చెందిన ఒక నివాసి మాట్లాడుతూ, "మా ఇల్లు దెబ్బతింది. తీవ్ర నష్టం వాటిల్లింది. సర్వం నాశనమైంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి, "రాత్రంతా మా కుటుంబం మొత్తం ఒకే గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపాం. మాకు శాంతి కావాలి" అని అన్నారు. దెబ్బతిన్న ఒక భవనాన్ని స్థానిక యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా కూల్చివేసింది.
Admin
Studio18 News