Studio18 News - జాతీయం / : జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం అప్రమత్తమైంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. లోయలో ఇటీవల ఉగ్రవాదులు చెలరేగిపోతున్న నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రం అలర్ట్ చేసింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కాన్వాయ్ల రాకపోకలను నిలిపివేసింది. అమర్నాథ్ యాత్ర వాహనాలపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. అలాగే, ఉగ్రదాడి ముప్పు నేపథ్యంలో బలగాలు ఒంటరిగా ఉండొద్దని కేంద్రం ఆదేశించింది. కాగా, తొలిసారి ఈ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ను మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణను 5 ఆగస్టు 2019న కేంద్రం రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.
Admin
Studio18 News