Studio18 News - జాతీయం / : Wayanad Landslides : కేరళ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో ఇప్పటివరకు 200 మందికిపైగా మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. ఇంకా వందకుపైగా స్థానికుల ఆచూకీ దొరలేదు. వారికోసం వెతుకులాట కొనసాగుతోంది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ కు చెందిన నాలుగు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే, మండకై నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నీటిమట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ఉత్తర కేరళలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మండక్కై జంక్షన్, చూరాల్మల పట్టణం మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. చూరాల్మల పట్టణంలో తమ కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారని జయన్ అనే వ్యక్తి కన్నీటిపర్యాంతమయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదు. ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద వస్తున్న శబ్దం వినిపించింది. ఆప్పుడు సమయం 3.30 అయింది. నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. అప్పుడే కరెంట్ పోయింది. గంటల సమయంలోనే ఇళ్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి. రాళ్లు వచ్చిపడ్డాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నదిలా మారిపోయింది. ఈ ఘటనలో తన భార్య తరపు 11 మంది కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పాడు. అమిత్ షా వర్సెస్ కేరళ సీఎం .. రెండు రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 219 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. అయితే, కేంద్రమంత్రి అమిత్ షా వాఖ్యలను ఆయన ఖండించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి ప్రజలను వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారని అన్నారు. అయినా వారి సలహాను కేరళ సర్కార్ పెడచెవిన పెట్టింది. భారీ వర్షాలు పడొచ్చని జూలై 18న, 25వ తేదీన రెండు సార్లు హెచ్చరికలు పంపాం. 20 సెంటీమీటర్ల భారీ వర్షం పడి కొండచరియలు పడొచ్చని 26న హెచ్చరించాం. అయినా స్థానికులను ఎందుకు తరలించలేదని కేరళ ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. అమిత్ షా చెప్పేదంతా అబద్ధం. 28వ తేదీ వరకు ఎలాంటి అలర్ట్ పంపలేదు. మంగళవారం కొండచరియలు పడ్డాక తీరిగ్గా ఉదయం 6గంటలకు రెడ్ అలర్ట్ ను పంపించారని అన్నారు. ఇవాళ రాహుల్ పర్యటన.. కొండచరియల విరిగిపడిన ఘటనలో మండక్కై, చూరాల్ మల పట్టణం పూర్తిగా దెబ్బతింది. మండక్కైలో దాదాపు 500 ఇళ్లు ఉంటాయి. విధ్వంసం తరువాత 450 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇదిలాఉంటే లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. సీఎం పినరయు విజయన్ తో కలిసి మెప్పాడి ప్రాంతంలో సహాయక శిబిరాల్లో వరద బాధితులను వారు పరామర్శించనున్నారు.
Admin
Studio18 News