Studio18 News - జాతీయం / : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన భీకర ఎదురుకాల్పుల ఘటనలో 27 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా బలగాల సాహసోపేతంగా వ్యవహరించాయంటూ కొనియాడారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) కూడా మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఇది నక్సలిజం నిర్మూలనలో ఒక మైలురాయి వంటి విజయమని ఆయన అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా తన పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ రీపోస్ట్ చేస్తూ భద్రతా బలగాలను ప్రశంసించారు. "మీ అద్భుత విజయాన్ని చూసి గర్వపడుతున్నాను. మావోయిజం ముప్పును పూర్తిగా తొలగించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ప్రధాని తన సందేశంలో తెలిపారు. మాధ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ కూంబింగ్లో బీజాపూర్, నారాయణ్పూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బలగాలు పాల్గొన్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రె గుట్ట పర్వత ప్రాంతాల్లో 24 రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఆపరేషన్లో 16 మంది మహిళా మావోయిస్టులతో సహా మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో మావోయిస్టుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరమయ్యాయని స్పష్టమవుతోంది.
Admin
Studio18 News