Studio18 News - జాతీయం / : భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ రకాల ఆయుధాల గురించి ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది. ఇక భారత్ వద్ద ఉన్న ఆయుధాల్లో... యుద్ధ ట్యాంకులు, శత్రు స్థావరాలు, బంకర్లను లక్ష్యంగా చేసుకుని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు (ఏటీజీఎం) ముఖ్యమైనవి. ఈ అత్యాధునిక అస్త్రాలు భారత సైనిక పాటవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏటీజీఎం – విధ్వంసకర అస్త్రం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏటీజీఎం) ప్రధానంగా శత్రువుల యుద్ధ ట్యాంకులు, పటిష్టమైన కవచాలు కలిగిన సైనిక వాహనాలు, బంకర్లను ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తివంతమైన క్షిపణి. దీనిని ప్రయోగించిన తర్వాత, అది స్వయంచాలకంగా లక్ష్యాన్ని గుర్తించి, అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. సైనికులు భుజంపై నుంచి, ట్రైపాడ్పై అమర్చి లేదా వాహనాలపై నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. సురక్షిత దూరం నుంచే శత్రు స్థావరాలను నిర్వీర్యం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా ఏటీజీఎంలలో 'షేప్డ్ ఛార్జ్' సాంకేతికత ఉంటుంది. ఇది పేలుడు శక్తిని ఒకే బిందువుపై కేంద్రీకరించి, ఎంతటి మందపాటి కవచాన్నైనా చీల్చుకుపోయేలా చేస్తుంది. కొన్ని క్షిపణులలో 'ట్యాండమ్ వార్హెడ్' వ్యవస్థ ఉంటుంది. ఇది రెండు దశల్లో పేలి, రక్షణ కవచాలను ఛేదించి అసలు లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. భారత సైన్యం వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన 'నాగ్' (భూమి పైనుంచి ప్రయోగించేది), 'ధ్రువాస్త్ర' (గతంలో హెలీనా - హెలికాప్టర్ నుంచి ప్రయోగించేది) వంటి అత్యాధునిక ఏటీజీఎంలు సిద్ధంగా ఉన్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి లక్ష్యాలను ఛేదించగలవు.
Admin
Studio18 News