Studio18 News - తాజా వార్తలు / : ఇటీవల ఓ సినిమా ఈవెంట్పై జేడీ చక్రవర్తి ఆవేదన ప్రచారం కోసం దిగజారడం అవసరం లేదన్న ప్రముఖ నటుడు మధ్యలోనే రావాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నానంటూ వ్యాఖ్య క్రియేటివిటీతో ఆకట్టుకోవాలి కానీ రోత పుట్టించొద్దని హితవు ఈ మేరకు తన అభిప్రాయాన్ని తెలుపుతూ వీడియో విడుదల ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఇటీవల సినిమా ప్రమోషన్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అతిథిగా హాజరైన ఓ సినిమా ఫంక్షన్లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని, అక్కడి నుంచి మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, "సినిమాలకు ప్రచారం కల్పించుకోవడానికి ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. ఇటీవల నేను అతిథిగా వెళ్లిన ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాను. అక్కడి నుంచి మధ్యలోనే తిరిగి వచ్చేయాల్సింది. ఇప్పుడు దాని గురించి 'బరాబర్' బాధపడుతున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సృజనాత్మక మార్గాలను ఎంచుకోవాలని, అంతే కానీ అసభ్యకరమైన చేష్టలతో కాదని ఆయన హితవు పలికారు. "సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, భాషలతో కాదని నేను బలంగా విశ్వసిస్తాను," అని జేడీ చక్రవర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల కిందట ఓ సినిమా ఈవెంట్ లో వేదికపై బూతులతో కూడిన పాట పాడడం తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే.
Admin
Studio18 News