Studio18 News - ఆరోగ్యం / : ప్రతి రోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా జరిగిన మరో అధ్యయనం కూడా నడక ప్రాముఖ్యాన్ని తెలియజెప్పింది. అయితే, నడకలో కాస్తంత వేగాన్ని పెంచడం ద్వారా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని జపాన్లోని దోషిషా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయంతో బాధపడుతున్న 25 వేలమందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. అధ్యయన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వేగంగా నడిచే వారిలో డయాబెటిస్ ముప్పు 30 శాతం తక్కువైనట్టు అధ్యయనకారులు గుర్తించారు. హైపర్ టెన్షన్, రక్తంలో అసాధారణ లైపోప్రొటీన్ లెవల్స్ (డిస్లీపిడీమియా) ముప్పు కూడా చాలా తక్కువని తేలింది. నడక వేగానికి, సమగ్ర ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. వేగంగా నడిచే వారిలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. ఇది మెరుగ్గా ఉంటే జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ముప్పు దూరంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు.
Also Read : 'విడుదల 2' - మూవీ రివ్యూ!
Admin
Studio18 News