
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగిన డీఎస్ ఇప్పుడు కుమారుల రాజకీయంతో నలిగిపోతున్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. కానీ సోమవారం ఆయన పేరుతో విడుదలైన ప్రకటనలో మాత్రంతాను కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని ప్రకటించారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలన్నారు. ఆ సందర్భంలో తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్… తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేకు లేఖ రాశారు డీఎస్. నిజానికి డీఎస్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. అయినా అలాగే గాంధీ భవన్కు వచ్చి తాను రాహుల్ గాంధీకి మద్దతుగా ఉండేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే తీరా తర్వాత రోజే సీన్ మారిపోయింది.. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్.. నిజామాబాద్ మాజీ మేయర్ . ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిన్న కొడుకు అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ప్రస్తుతం ధర్మపురి శ్రీనివాస్ అర్వింద్ తోనే ఉంటున్నారు. అందుకే సంజయ్… తన సోదరుడిపై ఆరోపణలు చేస్తున్నారు. డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లుగా బయటకు వచ్చిన లేఖ అంతా ఉత్తదేనని అది బలవంతంగా పెట్టించుకున్న సంతకం అని సంజయ్ ఆరోపిస్తున్నారు. తన తండ్రితో మాట్లాడనీయడం లేదని.. ఇదంతా అర్వింద్ కనుసన్నల్లో జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. బలవంతంగా ఆస్తులు కూడా రాయించుకున్నారని ఆయన అంటున్నారు. అర్వింద్ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందన్నారు. మొత్తంగా డీఎస్ ఇద్దరు కుమారుల మధ్య నలిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేరు. డీఎస్ కాంగ్రెస్లో చేరితేనే సంజయ్కు ప్రాధాన్యం ఉంటుంది. ఆయన కాంగ్రెస్లో చేరితే బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న అర్వింద్ కు సమస్య అవుతుంది. అందుకే ఇద్దరు కుమారుల మధ్య డీఎస్ నలిగిపోతున్నారు.