ఎస్వీ రంగారావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు… ఈ నెల 25 లోపు క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్

Spread the love
  • వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలకృష్ణ వ్యాఖ్యలు
  • ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు
  • ఇప్పటికే బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్
  • తాజాగా కాపునాడు అల్టిమేటం
Kapunadu demands apology from Balakrishna
వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఆ రంగారావు ఈ రంగారావు… ఆ అక్కినేని తొక్కినేని… అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలుగు చిత్రసీమ దిగ్గజాలు అయిన ఎస్వీఆర్, ఏఎన్నార్ లను ఎంతో చులకనగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

అక్కినేనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ కౌంటర్ ఇచ్చారు. ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా కాపునాడు మండిపడుతోంది. ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ ఈ నెల 25 లోపు మీడియా ఎదుటకు వచ్చి  క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు డిమాండ్ చేసింది. బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే ఏపీలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపులందరూ ప్లకార్డులు చేతబట్టి, మౌన ప్రదర్శన నిర్వహించాలని కాపునాడు పిలుపునిచ్చింది.

ఇంతకుముందు కూడా చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారని, రాజకీయాలు తమకే సాధ్యమంటూ బాలకృష్ణ అన్నారని, జనసేన పార్టీలో ఉండేవాళ్లు అలగాజనం, సంకరజాతి అనే మాటలు తమను ఎంతో గాయపరిచాయని కాపునాడు నేతలు పేర్కొన్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com