కేసీఆర్ పార్టీలో ఉన్నవాళ్లంతా తాలిబాన్లే.. నాకేం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: షర్మిల
- పాదయాత్రను అడ్డుకునేందుకే తనపై దాడి చేశారని ఆరోపణ
- సీఎం కేసీఆర్ డైరెక్షన్లో పోలీసులు తనను రిమాండ్ చేయాలనుకున్నారని వ్యాఖ్య
- గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ ఆర్ టీపీ అధినేత
కేవలం ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన కేసులో తనను అరెస్టు చేశారని, మహిళను అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి తనను పోలీస్ స్టేషన్ లో విచారించడంతో పాటు తన వెంట వచ్చిన కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ‘ఈ కేసులో సీఎం కేసీఆర్ సూచన మేరకు నన్ను రిమాండ్ చేయాలని పోలీసులు అనుకున్నారు. రిమాండ్ ఎందుకు చేస్తారు? నేనేమైనా నేరం చేశానా? నా నుంచి ఏమైనా ఆధారాలు సేకరించాలా? అందుకే జడ్జీ రిమాండ్ కు అనుమతించలేదు’ అని పేర్కొన్నారు.
తన పాదయాత్రలో కేసీఆర్ అవినీతి గురించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నానని షర్మిల చెప్పారు. అందుకే టీఆర్ ఎస్, కేసీఆర్ కుటుంబం తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం వేల కోట్లను అక్రమ మార్గంలో సంపాదించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమే దేశంలో అత్యంత ధనవంతమైన రాజకీయ కుటుంబం అన్నారు. పాదయాత్రలో తనపై, తమ నాయకులపై దాడులు చేసేందుకు టీఆర్ఎస్, ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు, తమ పార్టీ నాయకులకు ఏం జరిగినా దానికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.