హైదరాబాద్ నాగోల్‌లో కాల్పుల కలకలం.. కస్టమర్ల మాదిరి వచ్చి బంగారం షాపులో దోపిడీ

Spread the love

హైదరాబాద్ నాగోల్ లో కాల్పులు కలకలం రేపాయి. స్నేహపురి కాలనీలోని జువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు.. కాల్పులు జరిపారు. షాపు ఓనర్ ను బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్.. ఆధారాలు సేకరించింది.

చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం ఈ కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దొంగలు బంగారం షాపులోకి చొరబడి కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకెళ్లడం కలకలం రేపింది. బంగారం షాపులో ఉన్న వారిని బెదిరించేందుకు దొంగలు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆధారాల కోసం సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని పట్టుదలగా ఉన్నారు పోలీసులు.

కస్టమర్ల రూపంలో బంగారం షాపులోకి వచ్చిన దొంగలు.. కాల్పులు జరిపి భయబ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు బంగారం షాపు దగ్గరికి భారీగా తరలి వచ్చారు. అయితే, దర్యాప్తుకు ఇబ్బందిగా మారడంతో పోలీసులు వారిని వెనక్కి పంపేశారు. దొంగతనం జరిగిన తీరును చూస్తుంటే.. దుండగులు పథకం ప్రకారమే స్నేహపురి కాలనీలోని గోల్డ్ షాపును దొంగతనానికి ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిత్యం ప్రశాంతంగా ఉండే స్నేహపురి కాలనీలో కాల్పులు, చోరీ ఘటన స్థానికులను భయకంపితులను చేసింది. దొంగలను త్వరగా పట్టుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా నిఘా పెంచాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com