
ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య మొదలైన యుద్ధం ప్రభావం ప్రపంచ మొత్తం పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంధన సంక్షోభానికి కారణమైంది. 40 రోజులు సాగిన ఈ యుద్ధాన్ని ముగించడానికి చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికాలు రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. శాంతి చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్చరికలు చేశారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి బెదిరింపులకు దిగారు. ఒప్పందం కుదరకపోతే మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలు విఫలమైతే అమెరికా ఆయుధాలను చాలా సమర్ధవంతంగా ఉపయోగిస్తుందని హెచ్చరించారు. ‘‘మేము పునఃప్రారంభిస్తున్నాం…నౌకలలో అత్యుత్తమమైన మందుగుండు సామగ్రిని, ఇప్పటివరకు తయారు చేసిన అత్యుత్తమ ఆయుధాలను నింపుతున్నాం.. గతంలో మేము ఉపయోగించిన వాటి కంటే కూడా మెరుగైనవి. వాటితోనే మేము వాటిని పేల్చివేశాం.. ఒకవేళ మన మధ్య ఒప్పందం కుదరకపోతే, మేము వాటిని ఉపయోగిస్తాం..’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లు పాల్గొంటున్నారు. కానీ, ఇరాన్ తరఫున ఎవరు చర్చల్లో పాల్గొంటారనేది ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, పాకిస్థాన్లో జరుగుతున్న ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఇరాన్ నుంచి మధ్యవర్తుల రాకపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని సరిగ్గా అమలు చేయడంలో విఫలమయ్యారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం తిరిగి తెరవాల్సిన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ వ్యవహరించిన తీరుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులపై టెహ్రాన్ తీవ్రంగా స్పందిస్తూ.. అది కూడా ఒప్పందం పరిధిలోకి వస్తుందని నొక్కి చెబుతోంది.
‘‘యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపడం అనేది అన్ని రంగాలలో, ముఖ్యంగా లెబనాన్లో అమెరికా తన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుంది’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మరోసారి బెదిరింపులకు దిగడం పీటముడి మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఇక, ఇరాన్ యుద్ధం ముగింపునకు ప్రతిపాదించిన 10 అంశాలపై కూడా అమెరికా విబేధిస్తోంది.
ఇదే సమయంలో పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మరింత సందిగ్ధతకు దారితీసింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్పై పెట్టిన పోస్ట్ ఇరు దేశాల మధ్య చిచ్చు రేపింది. ఇజ్రాయెల్ను ఆయన కేన్సర్తో పోల్చుతూ.. దానిని నిర్మూలించాలని సంచలనానికి తెరతీశారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని, విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించారు. అయితే, పాక్ రక్షణ మంత్రి తన పోస్ట్ను డిలీట్ చేయడంతో వివాదం కొంత సద్దుమణిగింది.




