ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బీహార్లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (JSP) చీఫ్ మనోజ్ భారతి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రశాంత్ కిశోర్కు ఈ ఎన్నికల్లో ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లు వస్తాయని, ఆయన డిపాజిట్ కూడా కోల్పోతారని ఎద్దేవా చేసింది.
ఈ పరిణామంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ మాట్లాడుతూ, “ఆయన కేవలం డిపాజిట్ కోల్పోవడానికే పోటీ చేస్తున్నారు. ఆయనకు నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావు” అని వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “గత 30 ఏళ్లుగా బంకిపుర్ స్థానంలో బీజేపీనే గెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ పోటీ చేసినా, మరెవరు చేసినా ఫలితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈసారి కూడా భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థే గెలుస్తారు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, జేడీయూ నేత చంద్రేశ్వర్ ప్రసాద్ స్పందిస్తూ, “ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ నా అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించలేరు” అని పేర్కొన్నారు.
కాగా, ప్రశాంత్ కిశోర్ పాట్నాలో మాట్లాడుతూ, తమ పార్టీ ఈ ఉపఎన్నికలో పూర్తి శక్తితో పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ గెలుపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది వేస్తుందని ఆయన అన్నారు. “జన్ సురాజ్ ఉద్యమాన్ని నమ్మిన లక్షలాది మంది కోసం, బీహార్లో మార్పు కోసం ఈ బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తున్నాను” అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.

