- పడవ నడిపేవారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ముచ్చటించిన మోదీ
- కెమెరా చేతబట్టి నది అందాలను క్లిక్మనిపించిన మోదీ
- బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్న మోదీ
ప్రధానమంత్రి నరంద్ర మోదీ శుక్రవారం ఉదయం కోల్కతాలోని హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేశారు. పడవ నడిపేవారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హుగ్లీ నదిలో బోట్ రైడ్ చేసిన మోదీ, కెమెరా చేతబట్టి నది అందాలను క్లిక్మనిపించారు.
హుగ్లీ నది బెంగాల్ సంస్కృతిలో ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగానదికి ప్రత్యేక స్థానం ఉందని, దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం కొద్దిసేపు హుగ్లీ నది తీరంలో గడిపినట్లు పేర్కొన్నారు. పడవ నడిపే వారితో, ఉదయపు నడకకు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపారు. పడవ నడిపేవారి శ్రామిక శక్తిని మోదీ ప్రశంసించారు.
ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తమ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని అన్నారు. హుగ్లీ నది ఒడ్డున తాను వెచ్చించిన సమయం చాలా ప్రత్యేకమైనదని మోదీ మరో పోస్టులో పేర్కొన్నారు. చారిత్రాత్మక విద్యాసాగర సేతు, హౌరా వంతెనను దగ్గరగా చూడటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.




