రాష్ట్రాన్నే బాగు చేయలేని కేసీఆర్.. దేశాన్ని బాగు చేస్తానంటున్నాడు: ఈటల

Spread the love
  • తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్న ఈటల
  • బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణతో కేసీఆర్ బంధం తెగిపోయిందని వ్యాఖ్య
  • వైసీపీతో కలిసి తెలంగాణ సెంటి మెంట్ ను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
KCR connection with Telangana ended says Etela Rajender

ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రాన్నే బాగుచేయలేని కేసీఆర్… దేశాన్ని ఏం బాగుచేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు. తమ భరోసా యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో కేసీఆర్ కు తెలంగాణతో అనుబంధం తెగిపోయిందని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న వైసీపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని… టీఆర్ఎస్ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి అందరూ కలిసి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. నల్గొండ నియోజకవర్గంలో ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీని ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com