- గుజరాత్పై ఆర్సీబీ విజయంలో 81 పరుగులతో మెరిసిన విరాట్ కోహ్లీ
- మ్యాచ్ గెలిపించినా సెంచరీ చేయలేకపోయానని కోహ్లీ అసంతృప్తి
- ఈ విషయాన్ని వెల్లడించిన గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా
- కోహ్లీ పట్టుదల, ఫిట్నెస్పై దహియా ప్రశంసల వర్షం
- గుజరాత్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం కోహ్లీ నామస్మరణతో నిండిపోయిన వైనం
గత రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 18.5 ఓవర్లలోనే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో కోహ్లీ ఆడిన 81 పరుగుల (8 ఫోర్లు, 4 సిక్సులు) ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సున్నా పరుగుల వద్ద గుజరాత్ ఫీల్డర్లు ఇచ్చిన లైఫ్ను కోహ్లీ సద్వినియోగం చేసుకుని, మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు.
మ్యాచ్ అనంతరం గుజరాత్ ఓటమిపై ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధపడిన విజయ్ దహియాకు అనూహ్య అనుభవం ఎదురైంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కాస్తా ‘విరాట్ కోహ్లీ ఫ్యాన్ క్లబ్ మీటింగ్’లా మారిపోయింది. విలేకరులు గుజరాత్ ఓటమిని పక్కనపెట్టి, కోహ్లీ ప్రదర్శన, అతని మైండ్సెట్, పట్టుదల గురించే ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా దహియా ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ తనతో మాట్లాడాడని, “నేను ఈ 81 పరుగులను సెంచరీగా మార్చాల్సింది” అని నిరాశ వ్యక్తం చేశాడని దహియా తెలిపాడు. దీనిపై తాను స్పందిస్తూ, “రోజూ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేవాడికి మరోవైపు చూడాల్సిన అవసరం లేదు. క్యాచ్ డ్రాప్ అయినా, కఠినమైన పిచ్ను కూడా సులభంగా కనిపించేలా చేశావు. ప్రపంచ స్థాయి బౌలర్లను ఒత్తిడికి గురిచేసి నీకు కావాల్సినట్లు బౌలింగ్ చేయించుకున్నావు” అని చెప్పినట్లు వివరించాడు.
కోహ్లీ పట్టుదల గురించి మాట్లాడుతూ, “అతని ఎనర్జీ అద్భుతం. 37 ఏళ్ల వయసులోనూ ఇంతటి ఉత్సాహం, నైపుణ్యం, ఆటపై పట్టు ఉండటం అపూర్వం. అతను ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, తనను తాను మెరుగుపరచుకోవడానికే నిరంతరం ప్రయత్నిస్తాడు. ఇప్పటికీ అతను గేమ్లోనే ఉత్తమ రన్నర్లలో ఒకడు” అని దహియా కొనియాడాడు. కాగా, నిన్నటి విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.




