- డ్రైవర్ సుబ్రహ్మణ్యం
లో సంచలన పరిణామం - రాజమండ్రి కోర్టు బయట అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు హాజరైన సమయంలో ఘటన
- కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం
- గత నాలుగేళ్లుగా ఈ కేసు విచారణలో పలు మలుపులు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నాడు రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణకు హాజరైన ఆయన, కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలిస్తారని తెలుస్తోంది.
గత నాలుగేళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడుగా (ఏ-1), ఆయన భార్య లక్ష్మీదుర్గ ఏ-2గా ఉన్నారు. ఇటీవల రాజమండ్రి ప్రత్యేక కోర్టులో అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నిమిత్తం ఆయన తన భార్యతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.
అనంతబాబు అరెస్టు నేపథ్యంలో పోలీసులు రాజమండ్రి కోర్టు సముదాయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ అరెస్టుతో కేసు విచారణ మరోసారి వేగవంతం కానుందని భావిస్తున్నారు.




