Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కన్నుమూత అరవింద్ ను పరామర్శించిన చిరంజీవి, సురేఖ దంపతులు విశాఖ పర్యటనలో ఉన్నందున రాలేకపోయిన పవన్ కల్యాణ్ అరవింద్ ఇంటికి వెళ్లిన పవన్ భార్య అన్నా లెజినోవా అన్నా లెజినోవాను ఆత్మీయంగా పలకరించిన సురేఖ ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కనకరత్నమ్మ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే అల్లు, మెగా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో తన బావమరిది అల్లు అరవింద్ కు అండగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. అల్లు అరవింద్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. మరోవైపు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్న కారణంగా హైదరాబాద్ కు రాలేకపోయారు. అయితే, ఆయన తరఫున ఆయన భార్య అన్నా లెజినోవా.. అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిరంజీవి అర్ధాంగి సురేఖ... అన్నా లెజినోవాను ఆత్మీయంగా పలకరించారు. అల్లు అరవింద్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ రేపు పరామర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి అయిన ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Studio18 News