Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, అనవసర విషయాలపై ప్రజలు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ "నటి అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ పోస్ట్ను విరాట్ కోహ్లీ లైక్ చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆ లైక్ వల్ల అవ్నీత్కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్లు పెరిగారట. ఇది చాలా బాధ కలిగించే విషయం. మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా అనిపిస్తోంది" అని అన్నారు. "విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగా లైక్ చేశాడా, లేక పొరపాటున జరిగిందా అని కూడా ఎవరూ ఆలోచించలేదు. ఒక్కోసారి మనం ఇన్స్టాగ్రామ్లో మన స్నేహితులనే పొరపాటున అన్ఫాలో చేస్తుంటాం. కానీ, కోహ్లీ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు సంబంధించిన చిన్న విషయాలను కూడా వైరల్ చేస్తున్నారు. ఇది చాలా విచారకరం. ఈ విషయంపై ఆయన ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు" అని తెలిపారు. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా ప్రజలు అతిగా పట్టించుకుంటూ సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నారని రకుల్ అభిప్రాయపడ్డారు. "నా దృష్టిలో ఇది పూర్తిగా అనవసరం" అని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఈ లైక్ విషయంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లోని ఫీడ్ను క్లియర్ చేస్తున్నప్పుడు పొరపాటున లైక్ బటన్ నొక్కుకుపోయిందని తెలిపారు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని, అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని ఆయన కోరారు. అయినప్పటికీ, కోహ్లీ లైక్ తర్వాత అవ్నీత్కు ఫాలోవర్లు గణనీయంగా పెరిగారని, ఆమెకు ప్రమోషన్ల అవకాశాలు కూడా ఎక్కువయ్యాయని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఇక సినిమాల విషయానికొస్తే, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 3' చిత్రంలో నటిస్తున్నారు.
Admin
Studio18 News