Studio18 News - అంతర్జాతీయం / : భారత్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఏ ఇతర దేశం ఒత్తిడినీ అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎలాంటి చర్య ఎదురైనా, దానికి 200 శాతం దీటుగా స్పందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. "పాక్ సైన్యం ఎప్పుడూ భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకోదు. మా దాడులు కేవలం వారి సైనిక స్థావరాలకే పరిమితం అవుతాయి" అని తెలిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత దళాల చర్యలను పాకిస్థాన్ సైన్యం సమర్థవంతంగా అడ్డుకుందని చెప్పారు. భారత డ్రోన్లు తమ భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ, తమ కీలక సైనిక స్థానాలు, వ్యూహాత్మక ప్రదేశాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే వాటిని వెంటనే అడ్డుకోలేదని, అవి తమ పరిధిలోకి వచ్చిన తర్వాత కూల్చివేశామని ఆయన ఒక కొత్త వాదనను వినిపించారు. భారతదేశంలోని మీడియా తన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. యుద్ధంలో భారత్ ఓటమి పాలవుతుందనే నిజాన్ని భారత మీడియా వెల్లడించడం లేదని ఆయన అన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య సహజమైన పొత్తు ఉందని, ఈ రెండు దేశాలు ఇస్లాం పట్ల బహిరంగ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ కు టర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలు మద్దతు పలుకుతున్నాయని, కానీ భారత్ కు దాని మిత్రదేశాల నుంచి కూడా సరైన సహాయం అందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Admin
Studio18 News