Studio18 News - అంతర్జాతీయం / : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ దాడి చేసిందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కరాచీ పోర్టు ట్రస్ట్ (KPT) అధికారులు ఖండించారు, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్కు గురైందని, తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. వివిధ వార్తా సంస్థల కథనాల ప్రకారం, నిన్న రాత్రి కరాచీ నౌకాశ్రయ ప్రాంతానికి దగ్గరగా అనేక పేలుళ్లు సంభవించాయి. పాకిస్థానీ నావికా స్థావరాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగి ఉండవచ్చని అనధికారిక సమాచారం వ్యాపించింది. కరాచీ పోర్టుపై దాడి దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. ఈ నేపథ్యంలో, కరాచీ పోర్టు ట్రస్ట్ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసిందంటూ తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని, వాస్తవానికి తమ ఖాతా హ్యాకింగ్కు గురైందని వారు తెలిపారు. తమ హ్యాక్ అయిన ఖాతా నుంచి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు మీడియా సంస్థలు తమ అధికారిక పౌరసంబంధాల విభాగం ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరాచీలో జరిగిన ఘటనలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటనల కోసం ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది.
Admin
Studio18 News