Studio18 News - అంతర్జాతీయం / : భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్థాన్ అల్లాడుతుండగా, స్వదేశంలోనూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కార్యకర్తల నిరసనలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో, పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుడు షాహిద్ అహ్మద్, ప్రధాని షెహబాజ్ షరీఫ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షెహబాజ్ను 'పిరికివాడు'గా అభివర్ణించిన ఆయన, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా తమ ప్రధాని భయపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దుల్లో సైనికులు ధైర్యం కోరుకుంటున్నారని, కానీ ప్రధాని స్వయంగా పిరికివాడై, మోదీ పేరును కూడా ఉచ్చరించలేకపోతే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వారికి ఎలాంటి సందేశం పంపుతున్నామని షాహిద్ అహ్మద్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన టిప్పు సుల్తాన్ చెప్పిన ఓ సూక్తిని ఉటంకించారు. "సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు, యుద్ధంలో ఓడిపోతారు" అని షాహిద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల, మరో ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని, "యా ఖుదా, ఆజ్ బచా లో" (ఈ భారత్ మమ్మల్ని వదిలేలా లేదు... దేవుడా, ఈ రోజు మమ్మల్ని రక్షించు) అని ప్రార్థిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దేశంలో నెలకొన్న అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన దేవుడిని వేడుకున్నారు. భారత్ దాడుల భయం ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరిట తీవ్రమైన సైనిక చర్యలు ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ వరుస దాడులు చేసింది. నిన్న కూడా లాహోర్, రావల్పిండి వంటి కీలక నగరాల్లోని సైనిక వ్యవస్థలపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రభుత్వంపై అంతర్గతంగా కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పీటీఐ కార్యకర్తలు చేస్తున్న నిరసనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సొంత పార్టీ ఎంపీ నుంచే ప్రధానిపై తీవ్ర విమర్శలు రావడం గమనార్హం.
Admin
Studio18 News