Studio18 News - అంతర్జాతీయం / : ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అంగారక గ్రహంపై మానవ కాలనీ ఏర్పాటు గురించి తన ఆశయాలను స్పష్టం చేశారు. అంగారకుడిపై ఒక స్వయం సమృద్ధి కలిగిన ఆవాసాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, స్పేస్ఎక్స్ చేపడుతున్న 'ఆక్యుపై మార్స్ మిషన్' ద్వారా ఈ బృహత్తర కార్యాన్ని సాధించనున్నట్లు తెలిపారు. కేవలం అంగారకుడిని సందర్శించడం మాత్రమే కాకుండా, మానవాళిని ఒక బహుళ గ్రహ జాతిగా మార్చాలన్నది తన ఆకాంక్ష అని మస్క్ పేర్కొన్నారు. "భూమికి ఏదైనా తీవ్ర విపత్తు సంభవించినా, మానవ నాగరికత కొనసాగేందుకు ఇది దోహదపడుతుంది. విశ్వం యొక్క స్వభావాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, మన ఉనికిని విస్తరించుకోవడానికి ఇది అవసరం" అని ఆయన వివరించారు. కోట్లాది సంవత్సరాల తర్వాత సూర్యుడి వల్ల భూమి నివాసయోగ్యం కాకుండా పోవచ్చని, అటువంటి పరిస్థితుల్లో అంగారకుడు మానవాళికి ఒక 'జీవ బీమా'గా ఉపయోగపడతాడని ఆయన అభిప్రాయపడ్డారు. సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడని, 440 మిలియన్ సంవత్సరాలకు సూర్యుడి వేడికి భూమిపై జీవం లేకుండా పోతుందని ఆయన అంచనా వేశారు. తొలుత 2026 నాటికి అంగారకుడిపై మానవరహిత వ్యోమనౌకను దించాలని, ఆ తర్వాత 2030 లోపు మానవులను పంపాలని మస్క్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తన లక్ష్యాన్ని సవరించుకున్న ఆయన, 2029 నాటికి మానవులు అరుణ గ్రహంపై అడుగుపెట్టే అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు. స్టార్షిప్ వ్యోమనౌకను విశ్వసనీయంగా కక్ష్యలోకి పంపడం, దాని పునర్వినియోగాన్ని సాధించడం ప్రస్తుతం తమ ప్రథమ ప్రాధాన్యతలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, మానవ చరిత్రలోనే ఇది ఒక నూతన అధ్యాయనానికి నాంది పలుకుతుంది.
Admin
Studio18 News