Studio18 News - అంతర్జాతీయం / : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా, కొన్ని పేలకుండానే కిందపడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, పంజాబ్లోని హోషియార్పూర్లో పాకిస్థాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు, లాహోర్లోని పాకిస్థాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ (AD) వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్థాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు, వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్థాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్పై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించగా, భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. అంతేకాదు, జేఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా... భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. నిన్న రాత్రి రెండు జేఎఫ్-17 ఫైటర్లను భారత్ కూల్చివేసింది. అవి గాల్లోకి లేచీ లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్ సెప్టర్ లను పంపించి పేల్చివేశాయి. ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీయగా, పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చైనాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Admin
Studio18 News