Studio18 News - టెక్నాలజీ / : మంచు తెల్లటి రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ, అమెరికాలోని మైనే రాష్ట్రం రమ్ఫోర్ట్ పట్టణంలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని ఓ ప్రాంతాన్ని గోధుమ వర్ణపు మంచు దుప్పటి కప్పేసింది. ఈ అసాధారణ వాతావరణాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో గోధుమ రంగు మంచు పేరుకుపోయిందని పట్టణ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే, స్థానికంగా ఉన్న ఓ పేపర్ మిల్లు సరిగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. పేపర్ను ఉత్పత్తి చేసే ఈ కంపెనీ నుంచి వెలువడే ‘బ్లాక్ లిక్కర్’ అనే వ్యర్థ పదార్థమే ఇందుకు దారితీసిందని వివరించింది. కొన్ని నమూనాలు సేకరించి పరిశీలించగా పీహెచ్ స్థాయి 10 కంటే ఎక్కువ చూపించిందని తెలిపింది. ఈ మంచును తాకవద్దని స్థానికులను అధికారులు హెచ్చరించారు. ఈ మంచు విషపూరితమైనది కాకపోయినప్పటికీ పెంపుడు జంతువులు, పిల్లలు అందులో ఆడుకోకుండా చూసుకోవాలని సూచించారు. చర్మ సంబంధ సమస్యలు వస్తాయని అప్రమత్తం చేశారు. ఆ తర్వాత మైనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పరీక్షలు నిర్వహించగా పీహెచ్ స్థాయి 8 కంటే తక్కువగా నమోదవడంతో ఆందోళన తగ్గింది. బుధవారం వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ మంచు కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గోధుమ రంగు మంచు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read : డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు
Admin
Studio18 News