Studio18 News - అంతర్జాతీయం / : హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ను గాజాలో ఇజ్రాయెల్ హతమార్చిన కొన్ని గంటల్లో చోటుచేసుకున్న మరో కీలక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిజారియాలోని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసం వైపుగా డ్రోన్ దూసుకొచ్చింది. దీనిపై నెతన్యాహు ప్రతినిధి ఒకరు మీడియాకు వివరాలు తెలిపారు. నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి జరిగిన సమయంలో ఆ సమీపంలో ఆయన లేరని అన్నారు. ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. డ్రోన్ను లెబనాన్ నుంచి ప్రయోగించారు. అది భవనాన్ని ఢీకొట్టిందని ఇజ్రాయెల్ మిలటరీ కూడా తెలిపింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన మరో రెండు డ్రోన్లను సైనికులు అడ్డుకున్నారు. డ్రోన్ దాడిని తామే చేసినట్లుగా హిజ్బుల్లా ఎటువంటి ప్రకటనా చేయలేదు. లెబనాన్లోని హమాస్ మిత్రపక్షమైన హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. అక్టోబర్ 7 దాడి నుంచి హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య రాకెట్ కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ గత నెలలో లెబనీస్ సరిహద్దు మీదుగా దళాలను కూడా పంపింది.
Admin
Studio18 News