Studio18 News - అంతర్జాతీయం / : Cyber Slavery : ఈజీ ఉద్యోగం అంటారు. లక్షల్లో సంపాదన అని ఊరిస్తారు. పొరపాటున టెంప్ట్ అయ్యారో.. ఇక అంతే సంగతులు. అడ్రస్ గల్లంతే. మన బలహీనతే ఎదుటివారి బలం అన్నట్లు దేశంలోని నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాల పేరిట వల విసురుతున్నారు కొందరు. ఇలా మోసపు వలలో చిక్కుకున్న 30వేల మంది అడ్రస్ గల్లంతైంది. ఉద్యోగాల ఆశతో ఫ్లైట్ ఎక్కిన వారు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంతకీ వాళ్లంతా ఏమైనట్లు? ఎందుకు వెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? సైబర్ స్లేవరీ చాప కింద నీరులా విస్తరిస్తున్న వేళ అధికారులు అలర్ట్ అయ్యారు. 2 కోట్ల 17 లక్షల మొబైల్ కనెక్షన్లను కట్ చేస్తూ టెలికాం శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇంతలా రియాక్ట్ అయ్యేంతలా సైబర్ బానిసలు భయపెడుతున్నారా? మిస్సైన 30వేల మంది ఆచూకీ కనిపెట్టడం సాధ్యమేనా? సర్కార్ కు సైబర్ స్లేవరీ విసురుతున్న సవాళ్లు ఏంటి? సైబర్ స్లేవరీ అంటే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిజిటల్ వేదికగా మోసాలకు పాల్పడే ముఠా. మన దేశం నుంచి యువకులను తీసుకెళ్లి వారితోనే మళ్లీ మన దేశం యువకులను టార్గెట్ చేయిస్తూ డబ్బులు లాగుతుంటారన్న మాట. చెప్పింది చేస్తే సరి. లేదంటే చిత్రహింసలు పెడతారు. గతంలో ఒకరిద్దరు ఇలాంటి ముఠా నుంచి బయటపడ్డారు. కరెంట్ షాక్ పెట్టడాలు, థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్లతో నరకం చూపించే వారని వారు బయటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్ల స్లేవరీ అనేది పక్కాగా ప్లాన్డ్ గా జరుగుతుంటుంది. ఫేక్ హామీలతో ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత వారితో చట్ట వ్యతిరేక పనులు చేయిస్తారు. అయితే, ఇదంతా ఆన్ లైన్ వేదికగానే జరుగుతుంటుంది. సైబర్ బానిసల గురించి గత మార్చిలోనే చర్చ జరిగింది. దాదాపు 5వేల మంది యువకులు కంబోడియాలోని ఓ ముఠా చేతిలో చిక్కుకుపోయారని ప్రచారం జరిగింది. డేటా ఎంట్రీ జాబుల మాయలో పడి కంబోడియా చేరుకుని అక్కడ సైబర్ స్లేవర్స్ గా మారిపోయారు. ఈ 5వేల మందితో దాదాపు 500 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు తెలిసి అంతా షాక్ అయ్యారు. 5వేల మందితోనే ఇలా ఉంటే.. ఇప్పుడు ఏకంగా 30వేల మంది మిస్సింగ్.. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం ఉందో చెప్పకనే చెప్పొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది. సైబర్ స్లేవర్లుగా మారిన వారితో రకరకాల మోసాలు చేయిస్తుంటారు. మహిళల పేరుతో డేటింగ్ యాప్స్ లో యువకులకు వల వేయడం వారితో క్రిప్టో ట్రేడింగ్, ఫేక్ స్టాక్ ఇన్వెస్ట్ మెంట్లు చేయించి పని అయిపోగానే చేతులు దులుపుకోవడం చేస్తుంటారు. ఈ సైబర్ స్లేవరీని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎన్ క్రిప్టడ్ కమ్యూనికేషన్ చానల్స్ ద్వారా బాగోతాలను నడిపిస్తుంటారు. వీపీఎన్, సోషల్ మీడియా యాప్ లోకి చేరి అమాయకులకు వల వేస్తుంటారు. ఏదో దేశంలో ఉండి ఇంకో దేశం వారిని టార్గెట్ చేయడం ద్వారా చట్టపరంగా కూడా వారిని గుర్తించడం కూడా ఇబ్బందిగా మారుతోంది.
Admin
Studio18 News