Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Keeravani : ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రభుత్వం తరపున, సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. జనసేన నాయకులను, కార్యకర్తలను కూడా పూజలు, హోమాలు చేయమని ఆదేశించారు. అయితే ఈ పూజలు, భజనల్లో నారాయణుని స్మరణ కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రం అందరూ పఠించేందుకు అనువుగా సంగీత దర్శకులు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోని రూపొందించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కీరవాణికి ప్రత్యక కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ విడుదల చేసారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖలో.. ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం. ఎం. కీరవాణి గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా శ్రీ కీరవాణి గారు ఆడియో రికార్డు చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః అని తెలిపారు. ఆ ఆడియో మీరు కూడా వినేయండి..
Admin
Studio18 News