Studio18 News - అంతర్జాతీయం / : సింగపూర్లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్లో ఓ భారతీయ కార్మికుడు హోటల్ ఎంట్రన్స్లోనే మలవిసర్జన చేశాడు. ఈ వ్యవహారాన్ని తాజాగా విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం కోర్టు అతడికి 400 సింగపూర్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.25వేలు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. వర్క్ పర్మిట్పై సింగపూర్లో ఉంటున్న భారత్కు చెందిన రాము చిన్నరాసా అనే కార్మికుడు గతేడాది మెరీనా బే సాండ్స్ రిసార్ట్కు వెళ్లాడు. అక్కడ తప్పతాగి క్యాసినోకు వెళ్లాడు. కొద్దిసేపు క్యాసినో ఆడిన అతడు.. బాత్రూమ్కు వెళ్లాలనుకున్నాడు. కానీ, మద్యం మత్తులో బాత్రూమ్కు వెళ్లే దారి తెలియక హోటల్ ఎంట్రన్స్లోనే మలవిసర్జన చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రామును గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 అక్టోబర్ 30న జరిగిన ఈ ఘటన తాలూకు ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇక ఈ ఏడాది జూన్ 4న రాము మరోసారి అదే హోటల్కు వెళ్లాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హోటల్కు వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాము తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని తీవ్రంగా మందలించిన జడ్జి.. రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Admin
Studio18 News