Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తాను క్షేమంగానే ఉన్నానని పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రకటించాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన కెనడాలోని వాంకోవర్లో ఉంటున్నాడు. నిన్న ఉదయం దుండగులు ఆయన ఇంటి బయట కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కాల్పులు తమ పనేనని జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గ్యాంగ్స్టర్ రోహిత్ గోడారా ప్రకటించుకున్నారు. కాల్పుల అనంతరం తాజాగా స్పందించిన ధిల్లాన్.. తాను క్షేమంగానే ఉన్నానని, తన వాళ్లందరూ క్షేమంగా ఉన్నారని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరాడు. తమకు మద్దతుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. అదే సమయంలో ధిల్లాన్ ఇన్స్టా రీల్స్లో తన ‘స్వీట్ ఫ్లవర్’ పాటకు జామ్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ‘ప్రేమను పంచుతూ ఉండండి’ అని దీనికి క్యాప్షన్ తగిలించాడు. ఆయన ఇంటిపై కాల్పుల విషయం వెలుగులోకి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ‘మీరు క్షేమంగా ఉన్నందుకు ఆనందంగా ఉంది’ అని ఒకరు రాస్తే.. ‘భద్రంగా ఉండండి బ్రదర్’ అని మరో అభిమాని రాసుకొచ్చాడు. ‘ఆయన క్షేమంగా ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు’ అని ఇంకో అభిమాని కామెంట్ చేశారు.
Admin
Studio18 News