Studio18 News - అంతర్జాతీయం / : పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ముసాఖైల్ జిల్లాలో 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు. పంజాబ్ (పాక్) నుంచి వస్తున్న వాహనాలను ఆపి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పది వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన వెనక బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) ఉగ్రవాదులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ గ్రూపు చాలా బలంగా ఉంది. ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన వెనకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బీఎల్ఏ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Admin
Studio18 News